ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలిజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ .
అర్జున్ సమాచారం. ఆగస్టు 21. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
ఆగస్టు 21, 2026:ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను పూర్తిస్థాయిలో కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని దండేపల్లి మండలం ద్వారక గ్రామంలో కొనసాగుతున్న ఎస్.టి. బాలుర వసతి భవన నిర్మాణ పనులను పరిశీలించి, పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఎస్.టి. వసతి గృహ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య, విద్యాబోధన తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకొని, కళాశాలలో విద్యార్థుల సంఖ్యను మరింత పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నో మ్యాపింగ్, అనుమలిస్ వారికి నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేయాలని, నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఓ.పి. రిజిస్టర్, వార్డు, ల్యాబ్, మందుల నిల్వలను పరిశీలించి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందులు, వైద్య సేవలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులలో జరుగుతున్న గర్భిణుల ప్రసవాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు విధులలో అందుబాటులో ఉండాలని, సమయపాలన పాటించాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులలో సాధారణంగా నమోదు అయ్యే వ్యాధుల వివరాలను తెలుసుకొని వర్షాకాలం దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి, పనులను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వంటశాల, భోజన శాల, వసతి గదులను పరిశీలించి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.
అనంతరం జన్నారం మండలం కిష్టాపూర్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యాబోధన ఇతర అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. విద్యార్థులకు సకాలంలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఓ.పి. రిజిస్టర్, వార్డు, మందుల లభ్యత, వైద్య సేవలను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో, ప్రైవేట్ ఆసుపత్రులలో జరుగుతున్న ప్రసవాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల హాజరు, అందుబాటులో ఉన్న వైద్య సేవలపై వివరాలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మండల తహసిల్దార్ తో మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నో మ్యాపింగ్, అనుమలిస్ వారికి నిబంధనల ప్రకారం నోటీసుల జారీ ప్రక్రియ త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, సంక్షేమ వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దండేపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.